సాహితీ ప్రపంచం ఒక మహా సముద్రం. ఆ సముద్రం లో ఉన్న మంచి రచనలను అంది పుచ్చుకుని చదవటం అనంతసాగరంలో ముత్యాల వేట అంత కష్టం. కష్టం సరే అదృష్టం కూడా కలిసి రావాలి. అను నిత్యం చదివే అలవాటు వున్నా ఎంతోమంది రచయితలు వారి రచనలు మనకు అందవు. కొంతమంది మంచి రచయితల పేర్లు సాహితీ ప్రపంచంలో విరివిగా వినిపించవు. అది పాఠకుల దురదృష్టం. డా. ఎం. సుగుణ రావు గారు ఆ కోవకే చెందుతారు. వారు రాసిన కథలు అది వరకే చదివినా కొంతకాలం క్రితం ఆధర్స్ అండ్ రైటర్స్ గ్రూప్ లో చేరాక సుగుణ రావు గారు రాసిన అన్ని కథలూ చదివాను.వారు కృషీవలుడు. విరివిగా రాస్తారు. అయినా వాసి తగ్గదు. ఎన్నో పోటీలలో విజేతగా నిలిచి బహుమతులు గెలుచుకోవటమే అందుకు దర్శనం సులభంగా అర్థమయ్యే శైలి వారిది. మానవత్వపు విలువలకు పెద్ద పీట వేస్తారు. వీరి రచనల్లో ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. ఎంతో కాలంగా రాస్తూ ఎన్నో కథలకు బహుమతులు గెలుచుకున్న ఈ రచయిత గురించి ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బహుమతులు గెలుచుకున్న బహుమతి పొందిన కథలతో సంపుటి వేయడం చాలా మంచి నిర్ణయం. కథలు పుస్తక రూపంలో వస్తే వాటి విలువ వేరు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులు నిర్వహించిన సార్థక నామధేయులు, డాక్టర్ సుగుణ రావు గారి ఆప్తురాలిగా వారిని మనసారా అభినందిస్తున్నాను. త్వరలోనే మరికొన్ని బహుమతులు గెలుచుకుని ఆ కథలతో మరొక సంపుటి వేయాలని ఆ సందర్భంలో కూడా నేను నాలుగు మాటలు రాయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.-- శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి ప్రముఖ కథా నవలా రచయిత్రి